
న్యూస్ డెస్క్పి: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని శనివారం మీడియాకు వెల్లడించారు. ఈ ప్రకటనతో ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వచ్చింది.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు రెండు దశల్లో జరుగనున్నాయి. అక్టోబర్ 23న తొలి విడత పోలింగ్, అక్టోబర్ 27న రెండో విడత పోలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. ఈ రెండు దశల్లో మొత్తం 5749 ఎంపీటీసీ, 565 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి.
తదుపరి దశలో గ్రామ సర్పంచ్ ఎన్నికలు మూడు విడతల్లో నిర్వహిస్తారు. అక్టోబర్ 31న తొలి విడత, నవంబర్ 4న రెండో విడత, నవంబర్ 8న మూడో విడత పోలింగ్ పూర్తవుతుంది.
సర్పంచ్ ఎన్నికలు పూర్తయ్యాకే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాలను ప్రకటిస్తామని ఎన్నికల కమిషనర్ స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 1.12 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
మొత్తం 31 జిల్లాల్లో 555 మండలాల పరిధిలో ఈ ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. అలాగే రిజర్వేషన్ గెజిట్ నోటిఫికేషన్లు ఇప్పటికే విడుదలైనట్లు పేర్కొన్నారు.
ఈ ఎన్నికలతో రాష్ట్ర రాజకీయ వాతావరణం మళ్లీ వేడెక్కనుంది. ప్రధాన పార్టీలన్నీ పూర్తి స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి.
