ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సెకండరీ గ్రేడ్ టీచర్ల బదిలీల విషయంలో కీలక మార్పు చోటుచేసుకుంది. ఇప్పటివరకు ఆన్లైన్ కౌన్సెలింగ్ ద్వారా చేపట్టిన బదిలీలను ఇకపై మాన్యువల్ పద్ధతిలో నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నిర్ణయించారు. దీనిపై సంబంధిత అధికారులకు ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
గత కొన్ని సంవత్సరాలుగా ఆన్లైన్ కౌన్సెలింగ్ విధానం కొనసాగుతుండగా, పలు సాంకేతిక సమస్యలు, అవగాహన లోపాలు ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురిచేశాయి. దీనిని పరిగణనలోకి తీసుకొని ఉపాధ్యాయ సంఘాలు మంత్రి లోకేశ్ను కలిసి అభ్యర్థనలు వినిపించాయి.
తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు కూడా దీనిపై స్పందిస్తూ, ఆన్లైన్ విధానంలోని లోపాలను వివరించారు. న్యాయమైన, పారదర్శకమైన బదిలీలు జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
ఈ అంశంపై సమగ్రంగా అధ్యయనం చేసిన మంత్రి లోకేశ్, మానవీయ కోణాన్ని దృష్టిలో ఉంచుకొని మాన్యువల్ కౌన్సెలింగ్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఉపాధ్యాయ సంఘాల్లో సంతోషం వ్యక్తమవుతోంది.
త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా మాన్యువల్ కౌన్సెలింగ్ విధానానికి విద్యావర్గాలు సంపూర్ణ మద్దతు తెలిపాయి.