
న్యూస్ డెస్క్: భారత విదేశాంగ మంత్రి జైశంకర్ మాస్కో పర్యటనలో రష్యా కంపెనీలను భారత్లో మరింత పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, అమెరికా ఒత్తిళ్ల నడుమ ఆయన చేసిన ఈ పిలుపు కీలకంగా మారింది. ముఖ్యంగా ఆయిల్ డీల్స్ విషయంలో భారత్ – రష్యా సంబంధాలు బలోపేతమవుతున్న సమయంలో ఇది ప్రాధాన్యత సంతరించుకుంది.
రష్యా ఉప ప్రధాని డెనిస్ మంటురోవ్తో జైశంకర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య వాణిజ్యం, టెక్నాలజీ, ఆర్థిక రంగాలలో సహకారాన్ని పెంచుకోవాలని చర్చించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సవాళ్లను ఎదుర్కొనేందుకు కొత్త మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.
భారత్ ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని జైశంకర్ పేర్కొన్నారు. ‘మేక్ ఇన్ ఇండియా’ వంటి కార్యక్రమాలు విదేశీ పెట్టుబడులకు కొత్త అవకాశాలు తెరిచాయని గుర్తు చేశారు. ఈ అవకాశాలను రష్యా కంపెనీలు ఉపయోగించుకోవాలని సూచించారు.
రాబోయే నెలల్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనకు రావనున్న నేపథ్యంలో ఈ చర్చలకు మరింత ప్రాధాన్యత పెరిగింది. ఇరు దేశాలు కలిసి ముందుకు సాగాలన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
మొత్తం మీద, భారత్ రష్యా బంధం వ్యూహాత్మకంగా మరింత బలపడుతోందని నిపుణులు భావిస్తున్నారు. ఆయిల్, టెక్నాలజీ, వాణిజ్యం రంగాలలో కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉన్నట్లు సమాచారం.
