
న్యూస్ డెస్క్: బీఆర్ఎస్ పార్టీ లోపల జరుగుతున్న పరిణామాలపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి బొగ్గు గని కార్మికులకు రాసిన బహిరంగ లేఖలో, తనను టీవీజీకేఎస్ గౌరవాధ్యక్ష పదవి నుంచి తొలగించడం వెనుక రాజకీయ కుట్రలే కారణమని ఆమె పేర్కొన్నారు. కార్మికుల కోసం పోరాడిన తనపై కక్ష కట్టారని కవిత ఆరోపించారు.
తన తండ్రి కేసీఆర్ కు రాసిన లేఖను ఉద్దేశపూర్వకంగా లీక్ చేశారని ఆమె మండిపడ్డారు. ఇటీవల అమెరికా పర్యటనలో ఉండగా ఆ లేఖను బయట పెట్టారని, తనపై వివిధ రూపాల్లో ఒత్తిడి పెంచుతున్నారని ఆమె వెల్లడించారు. ప్రస్తుతానికి కూడా తాను అమెరికాలోనే ఉన్నానని, తన కుమారుడి విద్యా విషయాల కోసం వెళ్లానని వివరించారు.
అంతేకాకుండా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన టీవీజీకేఎస్ సమావేశం కార్మిక చట్టాలకు విరుద్ధమని కవిత అభిప్రాయపడ్డారు. తనను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయని, ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారమే సాగుతున్నాయని ఆమె అన్నారు.
అయితే, టీవీజీకేఎస్ కొత్త గౌరవాధ్యక్షుడిగా ఎన్నికైన కొప్పుల ఈశ్వర్ కు కవిత శుభాకాంక్షలు తెలిపింది. వ్యక్తిగత విభేదాలు పక్కన పెట్టి ఆయనకు తన అభినందనలు అందజేయడం విశేషమైంది.
ఈ పరిణామాలతో బీఆర్ఎస్ అంతర్గత రాజకీయాలు మళ్లీ చర్చకు దారితీశాయి. కవిత ఆరోపణలు పార్టీ వర్గాలలో కలకలం రేపాయి.
