
జూబ్లీహిల్స్: ఉప ఎన్నికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇది కేవలం ఉప ఎన్నిక మాత్రమే కాదని, కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు ప్రజలు ఇచ్చే “మినీ రిఫరెండం”గా ఆయన భావిస్తున్నారు. ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలతో, ఆయన పకడ్బందీ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.
ఈ గెలుపు కోసం రేవంత్ రెడ్డి తన మంత్రులు, ఎమ్మెల్యేలకు కఠినమైన టార్గెట్లు నిర్దేశించారు. ప్రతి 100 మంది ఓటర్ల బాధ్యతను ఒక ఎమ్మెల్యేకు, ప్రతి 7-8 పోలింగ్ కేంద్రాల బాధ్యతను ఒక మంత్రికి అప్పగించారు.
ప్రతి నాయకుడు రోజూ కనీసం 250 ఇళ్లలో ప్రచారం చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని ఆదేశించారు. నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారు ప్రచార గడువు ముగిసేవరకు (నవంబర్ 9) నియోజకవర్గంలోనే మకాం వేయాలని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్, బీజేపీల నుంచి వస్తున్న సవాళ్లను తిప్పికొట్టేందుకు, బూత్ స్థాయిలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు రేవంత్ ఈ పక్కా ప్రణాళికను అమలు చేస్తున్నారు.
ఈ ఎన్నికల ఫలితం రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపుతుందని భావిస్తున్న రేవంత్, తన ప్రభుత్వానికి ప్రజల మద్దతు ఉందని నిరూపించేందుకు గట్టి పట్టుదలతో ఉన్నారు. “రేవంత్ పట్టుబడితే అంతే” అన్న నినాదం ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణుల్లో బలంగా వినిపిస్తోంది.
