
రంగారెడ్డి జిల్లా: చేవెళ్ల వద్ద గ్రావెల్ టిప్పర్, ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో 21 మంది మరణించడం యావత్ రాష్ట్రాన్ని కదిలించింది. ఈ ఘోర ప్రమాదం హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారి (NH 163) భద్రతపై తీవ్ర ప్రశ్నలను లేవనెత్తింది.
ఈ రహదారిని మృత్యుమార్గంగా పిలవడానికి బలమైన కారణాలున్నాయి. అప్పా జంక్షన్ నుంచి తాండూరు వరకు ఉన్న 69 కి.మీ. మార్గంలో ఏకంగా 50 ప్రమాదకరమైన మలుపులు ఉన్నాయి.
గడిచిన ఐదేళ్లలో ఈ రహదారిపై 720 ప్రమాదాలు జరగ్గా, 211 మంది ప్రాణాలు కోల్పోయారు. నిజాం కాలంలో నిర్మించిన ఈ రోడ్డుపై రద్దీ విపరీతంగా పెరిగినా, విస్తరణ మాత్రం జరగలేదు.
2018లో దీన్ని జాతీయ రహదారిగా గుర్తించి, రూ. 785 కోట్లతో విస్తరణకు శంకుస్థాపన చేశారు. కానీ, వందలాది పురాతన మర్రిచెట్లను తొలగించాల్సి రావడంతో పర్యావరణవేత్తలు ఎన్జీటీని, కోర్టులను ఆశ్రయించారు.
దీంతో రోడ్డు విస్తరణ పనులు పూర్తిగా ఆగిపోయాయి. ఈ చెట్ల వల్లే పనులు సాగడం లేదని, ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు దీన్ని “మర్రి శాపం”గా పిలుస్తారు.
విషాదమేమిటంటే, చెట్లను తొలగించకుండా, రీ-లొకేట్ చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో, సరిగ్గా ఈ ప్రమాదం జరగడానికి రెండు రోజుల ముందే ఎన్జీటీ ఆ స్టేను ఎత్తివేసింది. పనులు ప్రారంభం కానున్న తరుణంలోనే ఈ ఘోరం జరగడం అందరినీ కలిచివేస్తోంది.
