
న్యూస్ డెస్క్: వ్యాపారంలో అన్న ముఖేష్ అంబానీ అగ్రస్థానంలో దూసుకెళ్తుంటే, తమ్ముడు అనిల్ అంబానీ మాత్రం అప్పుల ఊబిలో కూరుకుపోయారు. తాజాగా, మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆయనకు భారీ షాకిచ్చింది.
అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ (RHFL), రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ (RCFL) సంస్థల్లో 2017-19 మధ్య యెస్ బ్యాంక్ పెట్టిన వేల కోట్ల పెట్టుబడులు 2019 నాటికి నిరర్థకాలుగా మారాయి. ఈ నిధులను అక్రమంగా ఇతర గ్రూప్ కంపెనీలకు మళ్లించారనేది ప్రధాన ఆరోపణ.
ఈ కేసు దర్యాప్తులో భాగంగా, ఈడీ శుక్రవారం సంచలన నిర్ణయం తీసుకుంది. అనిల్ అంబానీ గ్రూపునకు చెందిన రూ. 7500 కోట్లకు పైగా విలువైన ఆస్తులను జప్తు చేసింది. ఇందులో ముంబైలోని పాలిహిల్లో ఉన్న ఆయన నివాసం కూడా ఉండటం గమనార్హం.
ఈడీ జప్తు చేసిన ఆస్తుల్లో తెలుగు రాష్ట్రాల్లోనివి కూడా ఉండటం కలకలం రేపుతోంది. హైదరాబాద్లోని కామస్ కాప్రి అపార్ట్మెంట్స్లోని ఫ్లాట్లు, మంచిరేవుల వద్ద 75 ఎకరాల భూమి, ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా ఆస్తులు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.
మొత్తంగా రూ. 17,000 కోట్లకు పైగా నిధులు మళ్లించినట్లు ఆరోపణలున్న ఈ కేసులో, ఈడీ చర్యలతో అనిల్ అంబానీ మరింత ఉచ్చులో బిగుసుకున్నారు. ఈ భారీ జప్తులపై ఆయన గ్రూప్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
