
జమ్మూకశ్మీర్: పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి ఘటనపై ఖతార్ తీవ్రంగా స్పందించింది. ఈ క్లిష్ట సమయంలో భారత ప్రజలతో తమ దేశం పూర్తి సంఘీభావంగా ఉందని ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ వెల్లడించారు.
మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడిన ఆయన, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ సంభాషణలో పహల్గామ్ ఉగ్రదాడిపై ప్రధానంగా చర్చ జరిగింది.
ఈ దాడిని ఖండించిన అమీర్, ఉగ్రవాదం వ్యతిరేకంగా పోరాటంలో ఖతార్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. దాడికి పాల్పడిన వారిని శిక్షించేందుకు భారత్ చేపడుతున్న చర్యలకు ఖతార్ సంపూర్ణ సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.
ఖతార్ అమీర్ స్పందనపై ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ దురదృష్ట సమయంలో అందించిన మద్దతును భారత ప్రజలు ఎప్పటికీ మరిచిపోరని అన్నారు. ఉగ్రవాదం తరిమికొట్టేందుకు ప్రపంచం ఒక్కటిగా ఉండాలని పిలుపునిచ్చారు.
ఇరు దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా నేతలు చర్చించారు. ఇప్పటికే చేపట్టిన కీలక ఒప్పందాల అమలుపై దృష్టి పెట్టాలని నిర్ణయించారు.