
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన వేళ, ఇరాన్లో చిక్కుకున్న భారతీయుల తరలింపులో కీలక పురోగతి కనిపించింది. భద్రతా కారణాలతో గగనతలాన్ని మూసివేసిన ఇరాన్, భారత ప్రభుత్వ విజ్ఞప్తిపై స్పందించి ప్రత్యేక మినహాయింపు ఇచ్చింది. ఈ పరిణామంతో ‘ఆపరేషన్ సింధు’ ప్రారంభమైంది.
ఈ ఆపరేషన్ ద్వారా సుమారు 1000 మందిని స్వదేశానికి తీసుకురానున్నారు. మొదటి విమానం జూన్ 20 రాత్రి 11 గంటలకు ఢిల్లీకి చేరుకోనుంది. శనివారం మరో రెండు విమానాలు భారత్కు బయలుదేరనున్నాయి. అంతకుముందు 110 మంది భారత విద్యార్థులు ఆర్మేనియా మీదుగా వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ తరలింపు చర్యలు మరింత వేగం పడనున్నాయి. ఇరాన్ మొత్తం 4000 మంది భారతీయుల్లో సగం మంది విద్యార్థులే ఉండటంతో, వారి భద్రతపై ప్రభుత్వానికి టెన్షన్ పెరిగింది. ఈ నేపథ్యంలో తక్షణ చర్యలతో భారత ప్రభుత్వం మెరుగైన తీరును చూపించింది.
అంతర్జాతీయంగా విమాన సర్వీసులు నిలిచిపోయిన క్లిష్ట సమయంలో ఇరాన్ ప్రత్యేక అనుమతులు ఇవ్వడం శ్లాఘనీయం. ‘ఆపరేషన్ సింధు’ సజావుగా సాగుతుందన్న ఆశాభావం ఉంది.