
ఢిల్లీ: భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్‘ విజయవంతంగా కొనసాగుతున్న నేపథ్యంలో, నియంత్రణ రేఖ వెంబడి మే 7 నుంచి 10 మధ్య కాల్పుల పరంపర కొనసాగింది.
ఈ కాల్పుల్లో పాకిస్థాన్ సైన్యంలో 35 నుంచి 40 మంది వరకు సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు భారత సైనిక వర్గాలు ప్రకటించాయి. అదే సమయంలో ప్రత్యేక దాడుల్లో 100కి పైగా ఉగ్రవాదులు మట్టుబడ్డారని కూడా వెల్లడించారు.
ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎయిర్ మార్షల్ ఏకే భారతి, డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, మేజర్ జనరల్ ఎస్ఎస్ శర్మ, వైస్ అడ్మిరల్ ఏఎన్ ప్రమోద్ పాల్గొని ఈ వివరాలు వెల్లడించారు. భారత్ వేగంగా, కచ్చితంగా స్పందించిందని వారు తెలిపారు.
ఈ యుద్ధ ప్రాతిపదిక దాడుల్లో ఐదుగురు భారత సైనికులు వీరమరణం పొందారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరుల సేవలు చిరస్మరణీయమని అధికారులు అన్నారు.
పాకిస్థాన్ నుంచి ఉగ్రవాద మద్దతు ఎక్కడి నుంచైనా వస్తే, భారత్ దీటుగా ప్రతిస్పందిస్తుందని ఈ మీడియా సమావేశం స్పష్టం చేసింది.
ఇలాంటి చర్యల ద్వారా దేశ భద్రత కోసం భారత్ ఎలాంటి రాజీ కాదన్న సంకేతాన్ని ప్రపంచానికి పంపించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.