
న్యూస్ డెస్క్: ఏపీ మంత్రి నారా లోకేశ్ ఢిల్లీ పర్యటన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. సోమవారం ఢిల్లీకి వచ్చిన లోకేశ్, ఏపీకి సంబంధించిన ప్రాజెక్టులు నిధులపై ముగ్గురు కేంద్ర మంత్రులను కలిశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తరఫున ఆయన కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తూ, రాష్ట్రానికి అవసరమైన పనులు చేయించుకుంటున్నారు.
అయితే, లోకేశ్ పర్యటనల సందర్భంగా కనిపించే దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సోమవారం ఆయన ముగ్గురు కేంద్ర మంత్రులను కలిసినప్పుడు, ఆయన వెంట టీడీపీ జనసేన ఎంపీలు ఉండటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సహజంగా లోకేశ్ స్థాయి నేతలు ఒకరిద్దరినే తీసుకువెళ్లడానికి ఇష్టపడతారని, కానీ లోకేశ్ మిగిలిన నేతలకు భిన్నంగా అందరినీ కలుపుకుని వెళ్లడం ఆకర్షిస్తోంది.
దీనివల్ల ప్రభుత్వ పనుల్లో పార్లమెంటు సభ్యులకు భాగస్వామ్యం ఇచ్చినట్లు అవుతోందని అంటున్నారు. రాష్ట్రానికి ఏం కావాలి? ఏం చేయాలి? అన్న విషయాలపై లోకేశ్ సారథ్యంలో ఎంపీలకు అవగాహన కల్పిస్తున్నారని విశ్లేషిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంపీలకు కొన్ని కీలక బాధ్యతలు అప్పగించినా, వారు ఈ దిశగా అంతగా పనిచేసినట్లు కనిపించలేదు.
లోకేశ్ మాత్రం కూటమి ఎంపీలు అందరినీ కలుపుకొని కేంద్ర మంత్రులను కలుస్తుండటం వల్ల వారికి పరిచయాలు పెరుగుతున్నాయని అంటున్నారు. దీనివల్ల కేంద్రంలో కూడా టీడీపీ ఎంపీలు ప్రత్యేక ముద్ర వేసేలా పనిచేసే అవకాశం దొరుకుతుందని వ్యాఖ్యానిస్తున్నారు. కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్తో పాటు టీడీపీ జనసేన ఎంపీలు అందరినీ లోకేశ్ తనతో తీసుకువెళ్లారు.
దీనివల్ల కేంద్రం నుంచి రాష్ట్రానికి కావాల్సిన నిధులు, పథకాలు ఏ దశలో ఉన్నాయి? ఏం చేయాలి? అన్న విషయాలపై కూటమి ఎంపీలందరికీ స్పష్టమైన అవగాహన కలిగినట్లైంది. ఢిల్లీ పర్యటనలో లోకేశ్ చూపించిన ఈ ఐక్యతా విధానం హాట్ టాపిక్గా మారింది.
