
న్యూస్ డెస్క్: జనసేన ఎమ్మెల్సీగా ఇటీవల ఎన్నికైన నాగబాబు, తొలిసారిగా శాసన మండలిలో మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నారు. సోదరుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కంటే భిన్నంగా, నేరుగా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టడం గమనార్హం.
మూడు నెలల తర్వాత వచ్చిన ఈ అవకాశం ద్వారా ఆయన కోర్టుల్లో పెండింగ్ కేసుల అంశాన్ని ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా 3.3 కోట్ల కేసులు పెండింగ్ లో ఉన్నాయని, అందులో ఏపీలోనే లక్షకు పైగా కేసులు వాయిదాలు పడుతున్నాయని తెలిపారు.
తన ప్రసంగంలో ఆలస్యమైన న్యాయం వల్ల ఎన్నో నిరపరాధులు బాధపడుతున్నారని ఉదాహరణలతో వివరించారు. గుంటూరు జిల్లా వ్యక్తి ఆరు సంవత్సరాలు నిర్దోషిగా జైలులో గడిపిన ఘటనను ప్రస్తావిస్తూ, బాధితుని కోల్పోయిన కాలాన్ని ఎవరూ తిరిగి ఇవ్వలేరని భావోద్వేగంతో చెప్పారు.
నాగబాబు ప్రస్తావించిన ఈ అంశం మండలిలో వినిపించడం అరుదుగా జరిగే విషయం. సాధారణంగా రాజకీయ ఆరోపణలు మాత్రమే ఎక్కువగా వినిపించే సమయంలో, న్యాయవ్యవస్థ సమస్యలపై దృష్టి పెట్టడం విశేషంగా నిలిచింది.
ఆయన ఎంచుకున్న సబ్జెక్టు బడుగు బలహీనుల గొంతుకగా నిలిచిందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆలస్యంగా వచ్చే తీర్పులు బాధితులను మరింత ఇబ్బందుల్లోకి నెట్టుతున్నాయని ఆయన స్పష్టంగా వివరించారు.
తొలి ప్రసంగంలోనే ధైర్యంగా వ్యవహరించి, ప్రజా సమస్యలను అజెండాగా తీసుకువచ్చినందుకు నాగబాబు ప్రశంసలు అందుకుంటున్నారు. జనం మనసుకు దగ్గరగా నిలిచే ఈ తరహా అంశాలను ఆయన కొనసాగిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.
