
న్యూస్ డెస్క్: సెప్టెంబర్ 27న కరూర్లో విజయ్ టీవీకే ర్యాలీలో 41 మంది మరణించిన తొక్కిసలాట దేశాన్ని కదిలించింది. ఈ విషాదంపై పోలీసులు, పార్టీపై విమర్శలు వచ్చాయి. కానీ, చెన్నైకి చెందిన “భూవులగిన్ నంబర్గళ్” (భూ మిత్రులు) సంస్థ విశ్లేషణలో భయానక నిజాలు వెల్లడయ్యాయి.
ఐఎండీ, గూగుల్ ఎర్త్, థర్మల్ ఎనాలసిస్ టూల్స్ ఉపయోగించి చేసిన ఈ విశ్లేషణ ప్రకారం, ఇరుకైన ప్రదేశం, సరైన దారులు లేకపోవడమే ఈ విపత్తుకు కారణం. కానీ అసలు విలన్ జనం నుంచి వెలువడిన విపరీతమైన వేడి.
నివేదిక ప్రకారం, ఆ ప్రదేశంలో చదరపు మీటరుకు నలుగురికి పైగా జనం ఉన్నారు. వారి కేకలు, తోపులాటల వల్ల ఒక్కో వ్యక్తి నుంచి 250 వాట్ల వేడి విడుదలైంది. అంటే, మొత్తం మీద చదరపు మీటరుకు 1000 వాట్ల కంటే ఎక్కువ వేడి పుట్టింది.
ఇది మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తిన ఉన్నప్పుడు విడుదల చేసే వేడి (800 వాట్లు) కంటే చాలా ఎక్కువ. దీనికి తోడు, జనం రద్దీకి గాలి కూడా ఆడక (గాలి వేగం 5 mph నుంచి 1 mph కి పడిపోయింది), ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రత 42 డిగ్రీలకు చేరింది.
ఈ నరకంలో 6 గంటలు వేచి ఉండటంతో, విజయ్ రాకముందే వేడి, ఉక్కపోత తట్టుకోలేక ఓ తల్లి, బిడ్డ సొమ్మసిల్లి చనిపోయినట్లు నివేదిక తేల్చింది.
ఇటీవల జరిగిన పూరీ రథయాత్ర, హైదరాబాద్లోని ‘పుష్ప’ థియేటర్ తొక్కిసలాట, ఆర్సీబీ ర్యాలీల్లో జరిగిన మరణాలకు కూడా ఇదే తరహా వాతావరణ మార్పులు, అధిక వేడి కారణమని సంస్థ తేల్చింది.
