
న్యూస్ డెస్క్: ఆధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ పదవులను విస్తారంగా ఇచ్చిన జగన్, ఇప్పుడు విపక్షంలో ఉన్నా పార్టీ పదవులపై దృష్టి సారించారు. రాజ్యసభ, ఎమ్మెల్సీ, సలహాదారు వంటి పదవులు ఇచ్చినా, 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. అందువల్ల ఇప్పుడు పార్టీని బలోపేతం చేయడానికి కొత్త వ్యూహం అవసరమని జగన్ భావిస్తున్నారు.
ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా వర్కింగ్ ప్రెసిడెంట్లు, రీజనల్ కోఆర్డినేటర్లు వంటి పదవులను సృష్టించి, విశ్వాసం చూపిన వారికి అప్పగిస్తున్నారు. ఈ పదవులు అందుకున్న వారు ప్రాంతాల్లో పార్టీ కోసం మరింత శ్రమిస్తారని ఆయన నమ్మకం.
ఇటీవల రాష్ట్ర కార్యదర్శి పదవుల పందేరం కూడా జోరుగా సాగుతోంది. ఇంతవరకు గుర్తింపు పొందని సీనియర్లకు కూడా అవకాశాలు లభిస్తున్నాయి. వీరికి అసెంబ్లీ నియోజకవర్గాలపై పరిశీలన బాధ్యతలు అప్పగించడం ద్వారా వారిని చురుగ్గా ఉంచాలని వైసీపీ ప్రయత్నిస్తోంది.
విశాఖ, అరకూ, నర్సీపట్నం వంటి ప్రాంతాల్లో కొంతకాలంగా పదవులు లేదా టికెట్లు రాని నేతలకు ఇప్పుడు పార్టీ పదవులు ఇచ్చారు. ఇది వారికి భవిష్యత్లో టికెట్ అవకాశాలకు దారితీయవచ్చని చర్చ నడుస్తోంది.
పార్టీ వర్గాల ప్రకారం, ఇప్పుడు పనిచేసిన వారికి భవిష్యత్తులో పదవులు ఖాయం అనే విధానాన్ని జగన్ అనుసరిస్తున్నారు. ఈ ప్రయోగం వైసీపీకి ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.
