
న్యూస్ డెస్క్: తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) ప్రస్తుతం ఆ రాష్ట్ర రాజకీయాల్లో సుడిగాలిలా మారుతోంది. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన, అభిమానుల మద్దతుతో బలమైన శక్తిగా ఎదగాలని కసరత్తు చేస్తున్నారు.
ఈ నెల 13 నుంచి విజయ్ జిల్లాల పర్యటన ప్రారంభించనున్నారు. మొత్తం 38 జిల్లాల్లో ప్రజలతో నేరుగా కలుసుకొని బహిరంగ సభలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 20 వరకు రెండు విడతల్లో పర్యటన కొనసాగుతుందని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. మొదటి విడతలో చెన్నై వరకు, రెండో విడతలో మధురై వరకు చేరుకోవాలని ప్లాన్ చేశారు.
జిల్లా టూర్లతో ప్రజలకు దగ్గర కావాలన్న విజయ్ ఉద్దేశ్యం స్పష్టంగా కనిపిస్తోంది. అభిమానుల శక్తిని పార్టీ కేడర్గా మార్చుకోవడమే ప్రధాన లక్ష్యమని తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి భారీ స్థాయిలో భద్రత కల్పించాలని పార్టీ ఇప్పటికే తమిళనాడు డీజీపీకి లేఖ రాసింది.
ప్రస్తుతం డీఎంకే, అన్నాడీఎంకేల మధ్యే ప్రధాన పోటీ సాగుతున్న రాజకీయాల్లో టీవీకే ప్రవేశం త్రిముఖ పోరుకు దారితీస్తుందనే చర్చ ఉంది. అధికార డీఎంకేపై యాంటీ ఇంకంబెన్సీ వాతావరణం ఉన్న తరుణంలో విజయ్ పార్టీకి లాభం చేకూరే అవకాశాలున్నాయి.
అయితే, టీవీకే ఇంకా బలమైన కేడర్ బేస్ని ఏర్పరచుకోవాల్సి ఉంది. ఈ పర్యటనలతో ఆ లోటును పూరించాలన్నదే విజయ్ వ్యూహమని విశ్లేషకులు అంటున్నారు. రాబోయే ఎన్నికల్లో ఆయన పార్టీ ఏ స్థాయిలో ప్రభావం చూపుతుందో ఇప్పుడు అందరి దృష్టి అక్కడికే మళ్లింది.
