
సూర్యాపేట: శనివారం సూర్యాపేట జిల్లాలో జరిగిన ఒక సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సాధారణంగా రాజకీయాల్లో దూకుడుగా ఉండే బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి గుండకంట్ల జగదీశ్ రెడ్డి ఈసారి భావోద్వేగానికి గురయ్యారు. సాగునీరు అందక ఎండిపోతున్న పంట పొలాలను చూసి ఆయన కన్నీటి పర్యంతమయ్యారు.
పెన్ పహాడ్ మండలంలో పర్యటించిన జగదీశ్ రెడ్డి అక్కడి రైతులతో మాట్లాడే క్రమంలో పంటల దుస్థితిని చూస్తూ మౌనంగా మారిపోయారు. మాటలు ఆగిపోయి, ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకోలేకపోయారు. మీడియా ముందు మాట్లాడే సమయంలో ఒక్కసారిగా భావోద్వేగంతో ఏడ్చారు.
తెలంగాణ ప్రభుత్వం రైతులకు సాగునీరు అందించడంలో విఫలమైందని ఆయన ఆరోపించారు. గత పదేళ్లలో సాగునీటి ప్రాజెక్టులు ప్రగతిని చూశాయని, కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్ హయాంలో సాగు విస్తీర్ణం పెరిగిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు తగిన నీరు అందకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో సాగునీటి సమస్య మరింత తీవ్రమవుతుందని హెచ్చరించారు.
జగదీశ్ రెడ్డి భావోద్వేగానికి గురైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రైతుల సమస్యలపై ఆయన ఆసక్తిగా స్పందించడాన్ని చూసి పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.