
స్పోర్ట్స్ డెస్క్: రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు (RCB) – పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య జూన్ 3న జరగనున్న ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్పై ఇప్పుడు వరుణుడు తన ప్రభావాన్ని చూపే సూచనలు కనిపిస్తున్నాయి.
అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరగాల్సిన ఈ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
మంగళవారం రోజున మేఘావృత వాతావరణం ఉండే అవకాశం ఉందనీ, తేలికపాటి జల్లులు పడతాయని అంచనా. దీంతో మ్యాచ్ ఆలస్యమవటం, లేదా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో నిర్వాహకులు జూన్ 4న రిజర్వ్ డేను ఏర్పాటు చేశారు. ఫైనల్ మ్యాచ్ వర్షంతో రద్దైతే, ఆ రోజు కొనసాగిస్తారు.
కానీ రిజర్వ్ డే కూడా ఆటకు అనుకూలంగా లేకపోతే పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్కు టైటిల్ లభించే అవకాశం ఉంది.
ఈ అంశం RCB అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. విరాట్ కోహ్లీకి ఐపీఎల్ కప్ అందాలనే కల ఇప్పుడు వాతావరణం మీద ఆధారపడి ఉంది.
2023లో ఇదే వేదిక వర్షంతో మ్యాచ్ వాయిదా పడిన నేపథ్యంలో, ఈసారి ఎలాంటి ఆటంకం లేకుండా ఫైనల్ జరగాలని క్రికెట్ ప్రేమికులు ఆకాంక్షిస్తున్నారు.