
అమరావతి : ఆంధ్రప్రదేశ్ కు అలానే భారత దేశానికి తలమనికంగా నిలవనున్న పోలవరం ప్రాజెక్టుకు 2017–18 ధరల ప్రకారం నిధులు విడుదల చేస్తేనే ఆ ప్రాజెక్టు పూర్తవుతుందని కేంద్ర జల్ శక్తి శాఖకు పీపీఏ తేల్చింది. 2014 ఏప్రిల్ 1 నుంచి ప్రాజెక్టు నీటి పారుదల విభాగానికి అయ్యే వ్యయాన్ని వంద శాతం కేంద్రమే భరించాలని 2017 మార్చిలో కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని ఎత్తి చూపింది.
2013–14 ధరల ప్రకారం రూ.20,398 కోట్లతో ప్రాజెక్టును పూర్తి చేయడం సాధ్యం కానే కాదంటూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వాదనతో కేంద్రం ఏకీభవించింది. ప్రాజెక్టు పూర్తి కావాలంటే 2020 మార్చి 17న రివైజ్ట్ కాస్ట్ కమిటీ (ఆర్సీసీ) సిఫార్సు చేసిన మేరకు, 2017–18 ధరల ప్రకారం నిధులను విడుదల చేస్తేనే ప్రాజెక్టు పూర్తవుతుందని కేంద్ర జల్ శక్తి శాఖకు తేల్చి చెప్పింది.
నవంబర్ 2న నిర్వహించిన అత్యవసర భేటీలో ఆ మేరకు చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలను మినిట్స్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర జల్ శక్తి శాఖకు పంపింది. పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయంపై నిర్ణయాధికారం పీపీఏదే కావడంతో రూ.47,725.74 కోట్లకు కేంద్ర జల్ శక్తి శాఖ ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ (పెట్టుబడి అనుమతి) ఇవ్వడం లాంఛనమేనని జల వనరుల శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
దీని ఆధారంగా కేంద్ర ఆర్థిక శాఖ (వ్యయ విభాగం) 2017–18 ధరల ప్రకారం పోలవరం అంచనా వ్యయాన్ని రూ.47,725.74 కోట్లుగా ఆమోదించాలని కేంద్ర కేబినెట్కు ప్రతిపాదనలు పంపనుంది. విభజన చట్టం సెక్షన్–90 ప్రకారం ఆ ప్రతిపాదనపై కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది.