
న్యూస్ డెస్క్: పండుగ సీజన్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. దీపావళి, ఛఠ్ పూజ పండుగలకు సంబంధించి దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 12,000కు పైగా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ భారీ సంఖ్యలో రైళ్లను నడపడం ద్వారా ప్రయాణికులకు సౌకర్యాన్ని కల్పించనున్నారు.
ఈ సందర్భంగా మంత్రి అశ్విని వైష్ణవ్, విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన 41 మంది ఆర్పీఎఫ్ సిబ్బందిని రాష్ట్రపతి పతకాలు, జీవన్ రక్షా పతకాలతో సత్కరించారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) సిబ్బంది క్రమశిక్షణ, అంకితభావాన్ని ఆయన కొనియాడారు.
ప్రస్తుతం 150 వందే భారత్, 30 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సేవలు అందిస్తున్నాయి. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రతి ఏటా 7,000 కొత్త కోచ్లను తయారు చేస్తున్నామని, ఇందులో 3,500 జనరల్ కోచ్లను అదనంగా చేర్చామని మంత్రి తెలిపారు.
ప్రయాణికుల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. దేశీయంగా అభివృద్ధి చేసిన ‘కవచ్’ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ వ్యవస్థను ఢిల్లీ-హౌరా, ఢిల్లీ-ముంబై వంటి ప్రధాన మార్గాల్లో వేగంగా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే 1,200 లోకోమోటివ్లలో ఈ వ్యవస్థను అమర్చారు.
గడిచిన 11 ఏళ్లలో దాదాపు 35,000 కిలోమీటర్ల కొత్త రైల్వే ట్రాకులు వేశామని మంత్రి తెలిపారు. సుమారు 60,000 కిలోమీటర్ల మేర నెట్వర్క్ను విద్యుదీకరించారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 1,300 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికే 110 స్టేషన్లను ప్రారంభించారు. సోమవారం గుజరాత్లోని వల్సాడ్లో జరిగిన ఆర్పీఎఫ్ రైజింగ్ డే పరేడ్లో మంత్రి ఈ వివరాలను పంచుకున్నారు.
