
భారత క్రికెట్కు, ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్కు చిరస్మరణీయ విజయాలను అందించిన మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ పై ఆస్ట్రేలియా దిగ్గజ వికెట్ కీపర్ ఆడమ్ గిల్క్రిస్ట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2025 ఐపీఎల్ సీజన్ తర్వాత ధోనీ ఆటకు గుడ్ బై చెప్పాలని సూచించారు.
ఈ సీజన్లో చెన్నై జట్టు ఫామ్ బాలేకపోవడం, ప్లే ఆఫ్స్ రేసులో వెనుకబడిన పరిస్థితి నేపథ్యంలో గిల్క్రిస్ట్ స్పందించారు. ధోనీ ఇప్పటివరకు 98 బంతుల్లో కేవలం 140 పరుగులు మాత్రమే చేశారని, అతను ఇప్పటికే తన కెరీర్లో సరైన సమయంలో అత్యున్నత స్థాయిని తాకినట్టే అన్నారు.
“ధోనీకి నిరూపించుకోవాల్సింది ఇంకేమీ లేదు. కానీ జట్టు భవిష్యత్ దృష్ట్యా మార్పులు అవసరం. నువ్వొక ఛాంపియన్వి, ఐకాన్వి ఎంఎస్… ఐ లవ్ యూ!” అంటూ గిల్క్రిస్ట్ స్పందించారు.
2026 సీజన్ ముందు చెన్నై జట్టులో మార్పులు రావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ధోనీతో పాటు రషీద్, కాన్వే, దీపక్ హుడాలు కూడా టీమ్ నుంచి తప్పించాలని సూచించారు.
అంతేకాకుండా వచ్చే సీజన్ ముగిసే నాటికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబయి ఇండియన్స్ జట్లు పాయింట్ల పట్టికలో టాప్ 2లో ఉంటాయని గిల్క్రిస్ట్ జోస్యం చెప్పారు.