
న్యూస్ డెస్క్: సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ సిరీస్లో విరాట్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచినా, రుతురాజ్ గైక్వాడ్ యశస్వి జైస్వాల్ సెంచరీలతో అదరగొట్టారు.
గైక్వాడ్ రెండో మ్యాచ్లో 83 బంతుల్లో 105 పరుగులు చేశాడు. జైస్వాల్ సిరీస్ నిర్ణయాత్మకమైన చివరి మ్యాచ్లో అజేయంగా 116 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ను అందుకున్నాడు. అయితే వీరు శుభ్మన్ గిల్ శ్రేయాస్ అయ్యర్ గాయాల కారణంగానే జట్టులోకి వచ్చారు.
ఈ నేపథ్యంలో 2027 వన్డే వరల్డ్ కప్ జట్టుకు ఈ ఇద్దరు ఆటగాళ్లను పరిగణలోకి తీసుకుంటారా? అని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ను మీడియా ప్రశ్నించింది. దీనికి గంభీర్ సూటిగా స్పందించారు.
“చూడండి, వన్డే వరల్డ్ కప్కు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. అత్యంత ముఖ్యమైన విషయం వర్తమానంలో ఉండటమే” అని విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలు లాగానే గంభీర్ అన్నారు.
“జట్టులోకి వస్తున్న యువకులు అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ముఖ్యం. రుతురాజ్ గైక్వాడ్ను తీసుకోండి. అతను నాణ్యమైన ఆటగాడు, మనందరికీ తెలుసు. అతను ఇండియా ‘A’ తరపున మంచి ఫామ్లో ఉన్నందున మేము అతనికి ఈ సిరీస్లో అవకాశం ఇచ్చాం. మేము 40/2 తో ఒత్తిడిలో ఉన్నప్పుడు అతను రెండో మ్యాచ్లో సెంచరీ చేసి ఆ అవకాశాన్ని రెండు చేతులా అందుకున్నాడు. ఇది అత్యంత నాణ్యతతో కూడిన ప్రదర్శన” అని గంభీర్ ప్రశంసించారు.
గంభీర్ జైస్వాల్ను కూడా ప్రశంసించారు. “యశస్వికి ఎంత నాణ్యత ఉందో మనం టెస్ట్ క్రికెట్లో చూశాం. ఇది అతని కెరీర్ ప్రారంభం మాత్రమే. ఆశిద్దాం, అతను రుతురాజ్ మాదిరిగానే అద్భుతమైన భవిష్యత్తును కలిగి ఉంటాడు” అని హెడ్ కోచ్ అన్నారు.
