
న్యూస్ డెస్క్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ వేగవంతమైంది. సినీ, టీవీ ఇండస్ట్రీకి చెందిన దాదాపు 25 మంది సెలబ్రెటీలను అధికారులు గుర్తించారు.
ఇప్పటివరకు 22 మంది ప్రముఖుల నుంచి సిట్ అధికారులు స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు. దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్ వంటి హీరోలతో పాటు పలువురు యాంకర్లు ఈ విచారణకు హాజరయ్యారు.
ఇంకా మంచు లక్ష్మి, బిగ్ బాస్ హౌస్లో ఉన్న రితూ చౌదరి, విదేశాల్లో ఉన్న భయ్యా సన్నీ యాదవ్ ల స్టేట్ మెంట్లు రికార్డ్ చేయాల్సి ఉంది. వ్యక్తిగత కారణాల వల్ల మంచు లక్ష్మి మరింత సమయం కావాలని గడువు కోరారు.
ఇటీవల విచారణకు హాజరైన దగ్గుబాటి రానా ఆసక్తికర విషయం చెప్పారు. అనుమతి ఉన్న యాప్ అని తెలిసిన తర్వాతే తాను ప్రచారం చేసినట్లు రానా సిట్ అధికారులకు వివరించినట్లు తెలుస్తోంది. గంటన్నర పాటు ఆయనను అధికారులు పలు కోణాల్లో ప్రశ్నించారు.
మరోవైపు, విజయ్ దేవరకొండ కూడా విచారణకు హాజరై, ప్రమోషన్ల నిమిత్తం తీసుకున్న పారితోషకాలు, అగ్రిమెంట్ల వివరాలను సిట్కు అందజేశారు. ఇకపై బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయబోనని విజయ్, సిట్ అధికారుల ముందు హామీ ఇచ్చారు.
గతంలో ఈడీ, స్థానిక పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల ఆధారంగా ఈ విచారణ జరుగుతోంది. ఈ కేసును ప్రభుత్వం సీఐడీకి అప్పగించగా సిట్ ఏర్పాటు చేశారు. ఈ సంచలన కేసులో త్వరలో మరిన్ని కీలక అంశాలు బయటపడే అవకాశం ఉంది.
