
న్యూస్ డెస్క్: హాలీవుడ్ సినిమా కథను తలపించేలా ఒక షాకింగ్ సంఘటన రియల్ లైఫ్లో జరిగింది. మెక్సికోకు చెందిన మత్స్యకారుడు జోస్ సాల్వడార్ అల్వారెంగా దాదాపు 438 రోజుల పాటు ఒంటరిగా పోరాడి ప్రాణాలతో బయటపడ్డాడు. చరిత్రలోనే ఇంత సుదీర్ఘ కాలం సముద్రంలో ఒంటరిగా జీవించి ఉండటం ఇదే తొలిసారి.
నవంబర్ 2012లో అల్వారెంగా తన సహచరుడు కార్డోబా (22)తో కలిసి రెండు రోజుల చేపల వేటకు వెళ్లారు. కానీ అకస్మాత్తుగా వచ్చిన పెను తుఫాన్లో చిక్కుకుని వారి పడవ బోల్తా పడింది. కమ్యూనికేషన్ సిస్టమ్స్ దెబ్బతినడంతో వారు దారి తప్పి, సముద్రంలో ఇరుక్కుపోయారు.
దాదాపు ఏడాదికి పైగా పడవలోనే ఇరుక్కుపోయిన వీరు.. పచ్చి చేపలు, పక్షులను తింటూ, వర్షపు నీరు తాగి జీవించారు. తాబేలు రక్తాన్ని కూడా తాగి ఆకలిని తీర్చుకున్నట్లు అల్వారెంగా వివరించాడు. వారి బతికే ఆశలు చచ్చిపోయినా, అల్వారెంగా పోరాటాన్ని కొనసాగించాడు.
అయితే ఈ ప్రయాణంలో విషాదకరంగా కార్డోబా ప్రాణాలు కోల్పోయాడు. విషపూరితమైన పక్షిని తినడం వల్లే కార్డోబా మరణించాడని అల్వారెంగా వివరించాడు. ఆరు రోజుల పాటు సహచరుడి మృతదేహాన్ని పడవలోనే ఉంచుకున్నానని, ఆ తర్వాత సముద్రంలోకి విసిరేశానని చెప్పాడు.
దాదాపు 15 నెలల తర్వాత, 2014 జనవరిలో అల్వారెంగా మార్షల్ దీవులలో కొట్టుకుపోయి అద్భుతంలా ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ అతని కష్టాలు అక్కడితో ముగియలేదు. అల్వారెంగాపై కార్డోబా కుటుంబం 1 మిలియన్ డాలర్ల కోసం దావా వేసింది.
షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే.. అల్వారెంగా నరమాంస భక్షణకు పాల్పడ్డాడని కార్డోబా కుటుంబ సభ్యులు ఆరోపించారు. అంతేకాక, అల్వారెంగా రాసిన పుస్తకం ‘438 డేస్’ ద్వారా వచ్చే రాయల్టీలో 50 శాతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలను అల్వారెంగా తీవ్రంగా ఖండించాడు.
