
న్యూస్ డెస్క్: బంగ్లాదేశ్ రాజకీయాల మీద మరోసారి సంక్షోభం ముప్పు ఎదురవుతోంది. తాత్కాలిక ప్రభుత్వ అధినేత ముహమ్మద్ యూనస్, ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్ ఉజ్ జమాన్ మధ్య తీవ్ర విభేదాలు చెలరేగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
తొలుత మిత్రులుగా ఉన్న ఈ ఇద్దరు, ప్రస్తుతం ఎన్నికల నిర్వహణ, ఉగ్రవాదుల విడుదల వంటి అంశాలపై పరస్పరం విరుద్ధ ధోరణి అవలంబిస్తున్నారు.
శేక్ హసీనా పదవీ విరమణ అనంతరం యూనస్ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ, గత తొమ్మిది నెలలుగా ఎన్నికలు జరగకపోవడంపై ఆర్మీ అసంతృప్తిగా ఉంది. బీడీఆర్ తిరుగుబాటుదారులను, ఇస్లామిస్ట్ ఖైదీలను విడుదల చేయడం సైనిక వర్గాల్లో ఆగ్రహం రేకెత్తిస్తోంది.
లెఫ్టినెంట్ జనరల్ కమ్రుల్ హసన్ అమెరికా మద్దతును కోరినట్లు ఆరోపణలు రావడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. జనరల్ వాకర్ హసన్ను తొలగించాలనగా, యూనస్ అడ్డుకున్నారు.
యూనస్ రాజ్యాంగాన్ని మార్చి అధ్యక్షుడి అధికారాలు విస్తరించనున్నారన్న వార్తలు, వాకర్ ఎదురు చర్యలు తీసుకునే సూచనలతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది.
అవామీ లీగ్ నిషేధం ఎన్నికల స్వేచ్ఛపై ప్రశ్నలు పెంచుతోంది. బంగ్లాదేశ్ భవిష్యత్తు సందిగ్ధంలో పడింది.