
న్యూస్ డెస్క్: ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ భారత్ నుంచి పాకిస్తాన్కు గట్టి హెచ్చరిక పంపారు. “ఆఫ్ఘనిస్తాన్తో ఆటలు ఆడటం మంచిది కాదు. ఆఫ్ఘన్ల ధైర్యాన్ని పరీక్షించకూడదు” అని ముత్తాఖీ స్పష్టం చేశారు. 40 సంవత్సరాల తర్వాత ఆఫ్ఘనిస్తాన్ శాంతి, పురోగతిని సాధించింది.
ఈ సమయంలో తమ సరిహద్దు దగ్గర సుదూర ప్రాంతంలో పాకిస్తాన్ దాడి చేయడం తప్పుగా భావిస్తున్నామని ముత్తాఖీ అన్నారు.
తమ భూభాగాన్ని ఏ దేశానికి వ్యతిరేకంగా ఉపయోగించుకోవడానికి అనుమతించమని ముత్తాఖీ భారతదేశానికి హామీ ఇచ్చారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్కు తమ దేశం నుంచి ఈ కఠినమైన హెచ్చరిక రావడం గమనార్హం. తమ భూభాగం నుంచి ఇతర దేశాలపై దాడులు నిర్వహించేందుకు ఏ దేశానికి కూడా అనుమతి ఇవ్వలేదని ఆయన తెలిపారు.
ఢిల్లీలో అఫ్గానిస్థాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీతో భారత విదేశాంగ మంత్రి జై శంకర్ భేటీ అయ్యారు. ఇదే సమయంలో, భారత్ను తాము క్లోజ్ ఫ్రెండ్గా భావిస్తున్నామని ముత్తాఖీ పేర్కొన్నారు. ఆపదలో ఉన్నప్పుడు స్పందించిన తొలి దేశం భారత్ అని, ఇటీవల భూకంపం వచ్చినప్పుడు అందించిన మానవతా సాయానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
సమీప పొరుగు దేశంగా అఫ్గాన్ ప్రజల శ్రేయోభిలాషిగా, వారి అభివృద్ధికి భారత్ ఎప్పుడూ ఆసక్తి చూపుతుందని జై శంకర్ ఈ సందర్భంగా స్పందించారు. అఫ్గాన్ లో భారత్ చేపట్టిన అనేక ప్రాజెక్టుల పునరుద్ధరణకు మార్గం సుగమమైందని అన్నారు.
అభివృద్ధి పట్ల ఇరు దేశాలకూ ఒకేరకమైన నిబద్ధత ఉన్నప్పటికీ, రెండూ సీమాంతర ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్నాయని జై శంకర్ అన్నారు. భారత్ ఎప్పుడూ అఫ్గాన్కు అండగా నిలిచిందని తెలిపారు. ఈ సమావేశం జరుగుతున్న సమయంలోనే కాబూల్లో పాకిస్తాన్ వాయుసేన దాడులు జరపడం గమనార్హం.
కాబూల్లోని తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ) శిబిరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ సరిహద్దు దాడులను ప్రారంభించిన నేపథ్యంలోనే అఫ్గాన్ నుంచి ఈ హెచ్చరిక వచ్చింది. ఇదే సమయంలో కాబూల్లో భారత ఎంబసీని తిరిగి ఓపెన్ చేయనున్నట్లు జై శంకర్ వెల్లడించారు. భారత్లో అఫ్గాన్ విదేశాంగ మంత్రి ముత్తాఖీ పర్యటించడం ఇదే మొదటిసారి.
