
న్యూస్ డెస్క్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అనేది రెండంచుల కత్తి లాంటిదని, దాని వినియోగంపైనే మానవ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని ఎంఐటీ నిపుణుడు నీల్ థాంప్సన్ హెచ్చరించారు. ఈ శక్తివంతమైన సాధనాన్ని మంచికి, చెడుకు కూడా వాడుకునే ప్రమాదం ఉందని ఆయన స్పష్టం చేశారు.
ఒక సంస్థపై కోపంతో ఉన్న వ్యక్తి, ఏఐని ఉపయోగించి క్షణాల్లో లక్షలాది ఫేక్ రివ్యూలు సృష్టిస్తే పరిస్థితి ఏంటి? నిజమో, అబద్ధమో తెలియని సమాచారంతో మన ఈ-మెయిల్స్ నిండిపోతే అది ఎంత భయంకరంగా ఉంటుందో ఆయన ఉదహరించారు.
ఏఐ ఎంతటి ఆధునికమైనా, అది ఎప్పటికీ 100 శాతం కచ్చితమైనది కాదనే విషయాన్ని మర్చిపోకూడదు. అది చేసే ఒక చిన్న పొరపాటు కూడా ఊహించని పెను విపత్తులకు దారితీసే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.
ముఖ్యంగా యుద్ధ రంగంలో ఏఐ వాడకం అత్యంత ప్రమాదకరం. వేగవంతమైన నిర్ణయాల కోసం మానవ ప్రమేయాన్ని తొలగిస్తే, దాని పర్యవసానాలు ఊహకు కూడా అందవని థాంప్సన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
పోటీ ప్రపంచంలో వేగాన్ని అందుకోవడానికి దేశాలు, సంస్థలు ఏఐకి పూర్తి అధికారాలు ఇచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో అది మనిషి అదుపు దాటితే, తిరిగి నియంత్రించడం అసాధ్యంగా మారొచ్చు.
అందుకే, ఏఐని ఎలా నియంత్రించాలనే దానిపై ప్రపంచం తీవ్రంగా దృష్టి పెట్టాలి. అది మనిషి చేతిలో ఉన్నంతవరకే ఒక సాధనం, చేయి దాటితే మాత్రం మానవ మనుగడకే ప్రమాదమని ఆయన తేల్చిచెప్పారు.
