
న్యూస్ డెస్క్: భారత క్రికెట్లో సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ నెలకొల్పిన ఓ అరుదైన రికార్డు బద్దలయ్యే సమయం ఆసన్నమైంది. టీమిండియా తరఫున అత్యధిక మ్యాచ్లు (391) కలిసి ఆడిన జోడీగా ఉన్న వారి రికార్డును ప్రస్తుత దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అధిగమించబోతున్నారు.
ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే సిరీస్ ఈ చారిత్రక ఘట్టానికి వేదిక కానుంది. ఇప్పటివరకు 388 అంతర్జాతీయ మ్యాచ్లలో కలిసి బరిలోకి దిగిన ఈ ‘రో-కో’ ద్వయం, ఈ సిరీస్తో సచిన్-ద్రవిడ్ రికార్డును సమం చేసి, ఆపై అధిగమించనుంది.
సుమారు ఏడు నెలల విరామం తర్వాత ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్లు టీమిండియా జెర్సీలో కలిసి ఆడనుండటం విశేషం. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత మళ్లీ ఇప్పుడే వీరిద్దరూ వన్డే మ్యాచ్లో జతకడుతున్నారు.
వీరి ప్రయాణం ఇక్కడితోనే ఆగేలా లేదు. భవిష్యత్తులో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లండ్లతో జరగనున్న సిరీస్లతో ఈ జోడీ 400 మ్యాచ్ల మైలురాయిని కూడా అందుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
అయితే, ఈ రికార్డుల ప్రయాణం సాఫీగా సాగుతుందన్న గ్యారెంటీ లేదు. వారి భవిష్యత్తుపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలక్టర్ అగార్కర్ చేసిన వ్యాఖ్యలు ఈ దిగ్గజాల కెరీర్పై నీలినీడలు కమ్ముకునేలా చేస్తున్నాయి.
ఈ ఆస్ట్రేలియా సిరీస్లో రాణించడంపైనే వారి భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఒకవేళ విఫలమైతే, వారి రికార్డుల వేట సచిన్-ద్రవిడ్ మైలురాయి వద్దే ఆగిపోయే ప్రమాదం కూడా లేకపోలేదు.
