
హైదరాబాద్: ఫార్ములా-ఈ కేసులో తనకు ఏసీబీ నుంచి నోటీసులు అందాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. జూన్ 3 ఉదయం 10 గంటలకు విచారణకు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.
ఈ సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. “నలభై నాలుగు కోట్లు ఫార్ములా-ఈ ఖాతాలోనే ఉన్నప్పుడు విచారణ పేరుతో ప్రజాధనాన్ని వృథా చేయడం సరికాదు” అని అభిప్రాయపడ్డారు.
రేవంత్ రెడ్డిని లై డిటెక్టర్ పరీక్షకు సవాల్ విసిరిన కేటీఆర్, “న్యాయమూర్తి సమక్షంలో ఇద్దరం పరీక్ష చేయించుకుందాం. టీవీలో ప్రత్యక్ష ప్రసారం చేద్దాం. ప్రజలే తీర్పు చెప్పాలి” అన్నారు.
పదేళ్ల క్రితం నల్ల సంచి డబ్బుతో దొరికిన వ్యక్తిగా రేవంత్ను పరోక్షంగా ఉద్దేశించి, ఆయన నిజాయితీపై ప్రశ్నలు తీశారు. ఈ కేసు ద్వారా ప్రజల దృష్టిని మళ్లించే కుట్రగా అభివర్ణించారు.
అంతర్జాతీయ ఈవెంట్ అయిన ఫార్ములా-ఈ పై బురద చల్లే ప్రయత్నం రాజకీయ ఉద్దేశ్యంతోనే చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. విచారణకు పూర్తి సహకారం అందిస్తానని ఆయన స్పష్టం చేశారు.