
తెలంగాణ: బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (62) గుండెపోటుతో ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. గత మూడు రోజులుగా గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం మెరుగుపడక పోవడంతో తుదిశ్వాస విడిచారు.
మాగంటి గోపీనాథ్ రాజకీయ జీవితాన్ని టీడీపీతో ప్రారంభించారు. ‘తెలుగు యువత’ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసిన ఆయన 2014లో తొలిసారిగా టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.
అనంతరం బీఆర్ఎస్లో చేరి 2018, 2023లోనూ వరుసగా విజయం సాధించి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నిలిచారు. ప్రజలతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు వరుస విజయాలు తెచ్చిపెట్టింది.
అభివృద్ధి పనుల్లో ముందుండే గోపీనాథ్, జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి అంకితభావంతో సేవలు అందించారు. బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ఆయన, పార్టీకి కీలకంగా పనిచేశారు. నాయకత్వ లక్షణాలు గల నేతగా ఆయనకు మంచి పేరు ఉంది.
పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయన మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నియోజకవర్గ ప్రజలు, ఆయన సేవలను ఎంతో అభిమానంతో గుర్తు చేసుకుంటున్నారు