
స్పోర్ట్స్ డెస్క్: ఆర్సీబీ తొలి ఐపీఎల్ టైటిల్ విజయాన్ని పురస్కరించుకుని బెంగళూరులో నిర్వహించిన సన్మాన కార్యక్రమం విషాదంలోకి మారింది. చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
మొత్తం 13 మందికి గాయాలైనట్టు అధికారులు వెల్లడించారు. ఆర్సీబీ జట్టు విజయంతో నగరమంతా జోష్ వాతావరణంలో మునిగిపోయింది. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్వయంగా జట్టుకు ఘన స్వాగతం పలికారు. స్టేడియంలో జరిగిన సన్మాన కార్యక్రమానికి లక్షలాది మంది అభిమానులు హాజరయ్యారు.
అయితే, గేట్లు మూసి ఉండటంతో అభిమానులు గోడలు దాటి లోపలికి చొరబడేందుకు ప్రయత్నించారు. గేట్-2 వద్ద తలెత్తిన తొక్కిసలాటలో పలువురు కిందపడి గాయపడ్డారు. పోలీసులు లాఠీచార్జ్ చేసినా పరిస్థితి అదుపులోకి రాలేదు.
వెంటనే రంగంలోకి దిగిన వైద్య బృందాలు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించాయి. కానీ ఆరుగురు అప్పటికే మృతి చెందినట్టు సమాచారం. మిగతావారి పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉంది.
ఈ ఘటనపై కర్ణాటక ప్రభుత్వం విచారణకు ఆదేశించగా, క్రికెట్ అసోసియేషన్ నిర్వాహకులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆనంద వేడుక విషాదంగా మారడం ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది.