
భారత్ పాకిస్థాన్ సరిహద్దు మరోసారి ఉద్రిక్తతలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత పాక్ రేంజర్లు నియంత్రణ రేఖ (LOC) వద్ద కాల్పులకు తెగబడ్డారు.
ఈ కాల్పుల్లో 10 మంది అమాయక భారతీయ పౌరులు ప్రాణాలు కోల్పోయారని, పలువురు గాయపడినట్లు సైనిక వర్గాలు ప్రకటించాయి.
‘ఆపరేషన్ సిందూర్’ కింద భారత సైన్యం తొమ్మిది ఉగ్ర శిబిరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపింది. ఈ చర్యలతో సరిహద్దు ప్రాంతాల్లో పాక్ రేంజర్లు తీవ్రంగా రెచ్చిపోయినట్లు సమాచారం.
పాక్ వైపు నుంచి వచ్చిన కాల్పులు భారత పౌర ప్రాంతాలపై జరగడం గమనార్హం. ఈ ఘటనలో గాయపడినవారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
సంఘటనల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అత్యవసర సమీక్ష నిర్వహించారు. పారామిలిటరీ బలగాల ఉన్నతాధికారులతో చర్చించి, సెలవుల్లో ఉన్న సిబ్బందిని విధుల్లో చేరాలని ఆదేశించారు. సరిహద్దు భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని, అన్ని రకాల ప్రమాదాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.