
తెలంగాణకు వర్ష సూచన – రెండు రోజుల వరకూ అప్రమత్తంగా ఉండండి!
పలుజిల్లాల్లో వర్ష సూచన, హెచ్చరికలు జారీ
తెలంగాణ (Telangana) రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వాతావరణం మారుతోంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం (Hyderabad Meteorological Centre) తాజాగా వర్ష సూచనలు జారీ చేసింది. రాబోయే రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని అధికారులు తెలిపారు.
హైదరాబాద్, నల్లగొండ, ఖమ్మం, రంగారెడ్డి, ఉమ్మడి మెదక్, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ (Yellow Alert) ప్రకటించగా, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, హనుమకొండ, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ (Orange Alert) జారీ చేశారు.
వేగంగా వీచే గాలులు, ఉరుములు-మెరుపులు
కొన్ని ప్రాంతాల్లో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఉరుములు, మెరుపులు, పిడుగులు సంభవించే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చెట్ల కింద నిలవకూడదని, అవసరమైతే శాశ్వత కట్టడాల్లో తక్షణం ఆశ్రయం పొందాలని సూచించారు.
వర్షాలతో దెబ్బతిన్న మామిడి రైతాంగం
తాజా వర్షాల ప్రభావంతో మామిడి తోటలపై తీవ్ర ప్రభావం పడింది, పిందెలు రాలిపోయాయి. వరి పంటపై కూడా ప్రభావం చూపింది. కల్లాల్లో నీరు నిలిచిపోవడంతో వరి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంట చేతికొచ్చిన దశలో ఉండటంతో వర్షం వల్ల పంట నష్టపోతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
వాతావరణం చల్లబడినా.. వ్యవసాయానికి చేటే
ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వర్షాలతో ఉష్ణోగ్రతలు తగ్గి వాతావరణం కొంత మారింది. జనవరి చివరినుంచి అధిక వేడిగా ఉన్న వాతావరణం కొంత చల్లబడింది. అయితే వర్షాల వల్ల ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడుతున్నదీ వాస్తవం. అకాల వర్షాలతో పంటలకు నష్టం వాటిల్లడమూ వాస్తవమే.