
ఏపీ: రాజకీయాలు ఎప్పుడూ దేశమంతా ఆశ్చర్యపోయేలా ఉంటాయి. ఇక్కడ ఓటర్ల తీర్పు, పార్టీల పొత్తులు చాలా వైవిధ్యంగా కనిపిస్తాయి. దేశమంతా ఒకలా ఉంటే, ఏపీ ప్రజలు మాత్రం మరోలా ఆలోచిస్తారు.
సాధారణంగా ఎన్నికల తర్వాత పొత్తులు బీటలు వారడం చూస్తుంటాం. కానీ ఏపీలో ఎన్డీయే కూటమి మాత్రం ఫెవికాల్ బంధంలా కనిపిస్తోంది. వచ్చే పదిహేనేళ్లు కలిసే ఉంటామని నేతలు శపథాలు చేస్తున్నారు.
గతంలో 2014-19 మధ్య జరిగినట్లు కూటమి విడిపోతుందని వైసీపీ గట్టిగా నమ్ముతోంది. ఆనాడు జనసేన, బీజేపీలు టీడీపీకి దూరమవడంతో 2019లో తమకు కలిసొచ్చిందని ఆ పార్టీ అంచనా వేస్తోంది.
మళ్లీ అలాంటి సీన్ రిపీట్ అవుతుందని వైసీపీ ఆశపడుతున్నా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ పెద్దలు మాత్రం చాలా క్లారిటీగా ఉన్నారు. కూటమిలో చిన్న చిన్న గొడవలు ఉన్నా, వాటిని సరిదిద్దుకుంటూ ముందుకు సాగుతున్నారు.
సోషల్ మీడియాలో కూటమి విడిపోతోందని వైసీపీ ప్రచారం చేస్తున్నా, గ్రౌండ్ లెవల్ లో పరిస్థితి వేరుగా ఉంది. మూడు పార్టీలు కలిసికట్టుగా 2029 ఎన్నికలను ఎదుర్కోవడానికి ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నాయి.
దీంతో వచ్చే ఎన్నికల్లో కూడా బలమైన కూటమిని ఢీకొట్టక తప్పని పరిస్థితి వైసీపీకి ఏర్పడింది. కూటమి విడిపోతుందన్న ఆశలు వదులుకుని, ఒంటరి పోరాటానికి జగన్ సేన సిద్ధం కావాల్సిందే అని విశ్లేషకులు అంటున్నారు.
