
న్యూస్ డెస్క్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘ఫ్యూచర్ సిటీ’ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే దీనికి సంబంధించిన పెట్టుబడులు వరదలా వస్తుండటంతో, అంతర్జాతీయ స్థాయిలో ఈ నగరాన్ని తీర్చిదిద్దాలనే కసి ఆయనలో కనిపిస్తోంది.
అయితే ఈ కొత్త నగరాన్ని ఎలా డిజైన్ చేయాలనే చర్చ వచ్చినప్పుడు, గుజరాత్ లోని ‘గిఫ్ట్ సిటీ’ (GIFT City) బెస్ట్ ఎగ్జాంపుల్ గా నిలుస్తుంది. గాంధీనగర్ లో సబర్మతీ నది ఒడ్డున నిర్మించిన ఈ స్మార్ట్ సిటీ టెక్నాలజీ పరంగా అద్భుతమని చెప్పాలి.
అక్కడ చెత్త సేకరణ కోసం పారిశుధ్య కార్మికులు రావాల్సిన పనిలేదు. బిల్డింగ్స్ నుంచే నేరుగా పైపుల ద్వారా వాక్యూమ్ టెక్నాలజీతో చెత్తను ఆటోమేటిక్ గా సేకరిస్తారు. దేశంలోనే ఇది తొలి ఆటోమేటెడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ సిస్టమ్.
అలాగే కరెంట్ తీగలు, డ్రైనేజీ పైపులు బయటకు అస్సలు కనిపించవు. అన్నీ అండర్ గ్రౌండ్ లోనే ఉంటాయి. మంచినీరు, విద్యుత్ సరఫరా కోసం అక్కడ అత్యాధునిక యుటిలిటీ టన్నెల్ సిస్టమ్ ఉంది.
మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. అక్కడ ఏసీల ఔట్ డోర్ యూనిట్లు గోడలకు వేలాడుతూ ఉండవు. శుద్ధి చేసిన నీటిని చల్లబరిచి, సెంట్రలైజ్డ్ కూలింగ్ సిస్టమ్ ద్వారా బిల్డింగ్స్ కు పంపిస్తారు. దీనివల్ల కరెంట్ ఆదా అవ్వడంతో పాటు సిటీ అందంగా కనిపిస్తుంది.
రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్న ఫ్యూచర్ సిటీలో కూడా ఇలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడితే అది నిజంగానే అద్భుతంగా ఉంటుంది. గిఫ్ట్ సిటీ మోడల్ ను ఫాలో అయితే తెలంగాణ ముఖచిత్రమే మారిపోతుందని నిపుణులు అంటున్నారు.
