
న్యూస్ డెస్క్: విశాఖలో జరుగుతున్న సీఐఐ సదస్సు (CII Summit) ఏపీకి భారీ పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఇప్పటికే గూగుల్ డేటా సెంటర్ రాకతో టెక్ హబ్గా మారుతున్న విశాఖకు, ఇప్పుడు మరో దిగ్గజ సంస్థ నుంచి భారీ కానుక అందింది.
గూగుల్ బాటలోనే ఇప్పుడు రిలయన్స్ సంస్థ కూడా విశాఖలో అత్యాధునిక “ఏఐ డేటా సెంటర్” ఏర్పాటుకు ముందుకు వచ్చింది. సమ్మిట్ వేదికగా రిలయన్స్ ప్రతినిధులు సీఎం చంద్రబాబుతో సమావేశమై ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.
ఈ ఏఐ డేటా సెంటర్ అత్యాధునిక జీపీయూలు (GPUs), ఏఐ ప్రొసెసర్లతో ప్రపంచస్థాయిలో ఉండనుంది. గుజరాత్లోని రిలయన్స్ 1 గిగావాట్ సెంటర్కు అనుసంధానంగా దీన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇది ఆసియాలోనే భారత్ను ఏఐ హబ్గా నిలబెడుతుంది.
కేవలం డేటా సెంటరే కాకుండా, రిలయన్స్ సంస్థ కర్నూలులో 170 ఎకరాల్లో గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్క్ను కూడా ఏర్పాటు చేయనుంది. వీటికి అవసరమైన విద్యుత్ కోసం సోలార్ పవర్ ప్లాంట్ను కూడా నెలకొల్పనుంది.
గూగుల్, రిలయన్స్ వంటి దిగ్గజాల రాకతో విశాఖ రూపురేఖలు మారనున్నాయి. ఈ పెట్టుబడుల వల్ల ఏపీలో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది.
