
న్యూస్ డెస్క్: తెలంగాణకు చెందిన సింగరేణి కోలరీస్ కంపెనీకి మరో ప్రతిష్టాత్మక విజయం దక్కింది. ఇప్పటివరకు బొగ్గు తవ్వకాలకే పరిమితమైన ఈ సంస్థ ఇప్పుడు బంగారం, రాగి గనుల అన్వేషణలో అడుగుపెట్టింది. కర్ణాటకలోని దేవదుర్గ్ ప్రాంతంలో గనుల అన్వేషణ హక్కులు దక్కించుకోవడం సంస్థ చరిత్రలో మైలురాయిగా నిలిచింది.
కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఆన్లైన్ వేలంలో 37.75 శాతం రాయల్టీ కోట్ చేసి సింగరేణి ఎల్-1 బిడ్డర్గా నిలిచింది. సింగరేణి సీఎండీ ఎన్. బలరామ్ మాట్లాడుతూ, ఇది సంస్థ విస్తరణకు తొలి అడుగు అని, వచ్చే ఐదేళ్లలో అన్వేషణ పూర్తవుతుందని తెలిపారు.
దేవదుర్గ్లోని గనుల్లో సింగరేణి అన్వేషణ విభాగం ఆధ్వర్యంలో త్వరలో పరిశోధనలు ప్రారంభమవనున్నాయి. తుది నివేదిక కేంద్రానికి సమర్పించిన తర్వాత మైనింగ్ హక్కులు నిర్ణయించబడతాయి.
ఈ గనుల నుంచి మైనింగ్ చేసే సంస్థలు చెల్లించే రాయల్టీలో 37.75 శాతం సింగరేణికి లభిస్తుంది. దీని ద్వారా సంస్థకు దీర్ఘకాలిక ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
బంగారం, రాగి అన్వేషణ ఖర్చు రూ. 90 కోట్ల వరకు ఉంటుందని, ఇందులో రూ. 20 కోట్లు కేంద్రం సబ్సిడీగా ఇస్తుందని సమాచారం. ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే సింగరేణి కొత్త రంగంలో బలమైన స్థానం ఏర్పరచుకుంటుంది.
