
న్యూస్ డెస్క్: ఉపరాష్ట్రపతి ఎన్నికల పోరులో విపక్షాల ఇండియా కూటమి తన అభ్యర్థిని ప్రకటించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, తెలంగాణకు చెందిన బి. సుదర్శన్ రెడ్డిని అధికారికంగా బరిలోకి దింపింది. ఈ నిర్ణయం ద్వారా ఎన్నిక ఏకగ్రీవం కావాలన్న అధికార పక్షం ఆశలు చెదిరిపోయాయి.
జస్టిస్ సుదర్శన్ రెడ్డి 2007 నుండి 2011 వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలందించారు. ఆ తర్వాత గోవా లోకాయుక్తగా కూడా పనిచేశారు. ఆయన స్వస్థలం తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఆకుల మైలారం గ్రామం. న్యాయ రంగంలో ఉన్నతస్థాయిలో పనిచేసిన తెలుగు వ్యక్తిని ఉపరాష్ట్రపతి ఎన్నికలో నిలబెట్టడం ప్రతిపక్షాలకు ప్రతిష్ఠాత్మక నిర్ణయంగా మారింది.
ఇప్పటికే ఎన్డీయే అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పేరు ప్రకటించబడింది. దీనికి బదులుగా ఇండియా కూటమి కూడా దక్షిణాది నుంచే ఒక బలమైన అభ్యర్థిని ఎంపిక చేసింది. దీంతో ఇప్పుడు పోరు ఇద్దరు దక్షిణాది నేతల మధ్య ఆసక్తికరంగా మారింది.
రెడ్డి అభ్యర్థిత్వం కేవలం రాజకీయంగా కాకుండా వ్యూహాత్మకంగానూ కీలకమని విశ్లేషకులు భావిస్తున్నారు. న్యాయవ్యవస్థకు చెందిన వ్యక్తిని బరిలోకి దింపడం ద్వారా ప్రతిపక్షాలు మరింత బలం తెచ్చుకున్నాయి.
మొత్తానికి, ఈసారి ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం ఒక సాధారణ పోరు కాకుండా, దక్షిణాది నేతల మధ్య ప్రతిష్ఠాత్మకంగా మారనుంది. ఎవరు గెలుస్తారన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
