
న్యూస్ డెస్క్: ఆన్లైన్ షాపింగ్ సౌకర్యవంతంగా మారినప్పటికీ, మోసాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఖరీదైన వస్తువులు ఆర్డర్ చేస్తే, రాళ్లు రప్పలు డెలివరీ అవుతున్న ఘటనలు వినియోగదారులను భయాందోళనలకు గురిచేస్తున్నాయి.
తాజాగా, బెంగళూరుకు చెందిన ప్రేమానంద్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈ చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. ఆయన అమెజాన్లో రూ. 1.87 లక్షల విలువైన ‘శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7’ ఫోన్ను అక్టోబర్ 14న ఆర్డర్ చేశారు.
అక్టోబర్ 19న డెలివరీ అందుకున్న ఆయన, ముందు జాగ్రత్తగా అన్బాక్సింగ్ వీడియో రికార్డ్ చేశారు. సీల్డ్ ప్యాకేజీని తెరిచి చూడగా, అందులో స్మార్ట్ఫోన్కు బదులుగా ఒక ఫ్లోర్ టైల్ ముక్క ఉండటంతో నివ్వెరపోయారు.
గతంలో అనంతపురం జిల్లాలో ఓ వ్యక్తి రూ. 16 వేల ఎంఐ ఫోన్ ఆర్డర్ చేస్తే, అరకిలో రాయి వచ్చిన ఘటన మరవక ముందే, ఇప్పుడు ఏకంగా రూ. 1.87 లక్షల ఆర్డర్కు టైల్ రావడం కలకలం రేపింది.
ఈ మోసంపై ప్రేమానంద్ వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో, స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
బాధితుడి వద్ద అన్బాక్సింగ్ వీడియో రూపంలో బలమైన సాక్ష్యం ఉండటంతో, అమెజాన్ సంస్థ స్పందించింది. దర్యాప్తు కొనసాగుతుండగానే, ప్రేమానంద్కు ఆయన చెల్లించిన పూర్తి మొత్తాన్ని రీఫండ్ చేసింది.
