
న్యూస్ డెస్క్: భారత క్రికెట్ జట్టుకు ఆసియా కప్ ముందే శుభవార్త అందింది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో నిర్వహించిన ఫిట్నెస్ పరీక్షలో పలు స్టార్ ఆటగాళ్లు విజయవంతమయ్యారు. ఈ జాబితాలో వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ, టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా ఉన్నారు.
గతంలో జ్వరంతో బాధపడిన గిల్ ఈ టెస్ట్ తప్పనిసరిగా హాజరు కావాల్సి వచ్చింది. ఇప్పుడు ఫిట్గా తేలడంతో త్వరలోనే జట్టుతో కలవనున్నాడు. అతనితో పాటు జస్ప్రీత్ బుమ్రా, జితేశ్ శర్మ కూడా టెస్టుల్లో పాసయ్యారని సమాచారం.
మిగతా ఆటగాళ్లలో మహమ్మద్ సిరాజ్, యశస్వి జైస్వాల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్ పేర్లు ఉన్నాయి. వారి శారీరక సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు యో యో టెస్ట్, డీఎక్స్ఏ స్కాన్ లాంటి పరీక్షలు నిర్వహించబడ్డాయి.
రిటైర్ అయినప్పటికీ రోహిత్ శర్మ కూడా ఈ టెస్ట్లో పాల్గొనడం గమనార్హం. నవంబర్లో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ దృష్ట్యా ఆయన ఫిట్నెస్పై దృష్టి పెట్టారు. భారత్-ఏ తరఫున ప్రాక్టీస్ మ్యాచ్ల్లో కూడా రోహిత్ ఆడే అవకాశం ఉందని తెలిసింది.
అంతకుముందే అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ వంటి ఆటగాళ్లు దులీప్ ట్రోఫీలో ఆడుతున్నందున వారికి వేరే పరీక్షలు నిర్వహించలేదని తెలుస్తోంది. వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ మాత్రం గాయం కారణంగా ఇంకా వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నాడు.
