
తెలంగాణ: సీఎం రేవంత్ రెడ్డి మరోసారి బీసీల రిజర్వేషన్లపై స్పష్టమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ఆదేశాలతో విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లును అసెంబ్లీలో పాస్ చేశామని తెలిపారు.
దేశానికి ఆదర్శంగా నిలిచేలా తెలంగాణలో కులగణన జరిగిందని చెప్పారు. బీసీల కోసం రూపొందించిన బిల్లులు ప్రస్తుతం రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉన్నాయని రేవంత్ పేర్కొన్నారు.
రాష్ట్రపతిని కలిసి వినతిపత్రం ఇవ్వాలనుకున్నప్పటికీ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం అనుమానాస్పదమని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ ఆ అపాయింట్మెంట్ ఇవ్వొద్దని రాష్ట్రపతిపై ఒత్తిడి తెచ్చారని తమకు అనుమానం ఉందని అన్నారు.
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న బీసీ ధర్నాలో మాట్లాడిన రేవంత్, దేశ వ్యాప్తంగా కులగణన జరగాలని రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సమయంలోనే డిమాండ్ చేశారని గుర్తు చేశారు. తెలంగాణలో ఆ దిశగా ముందుకెళ్తూ ప్రత్యేకమైన బిల్లును తీసుకువచ్చామన్నారు.
రాష్ట్రపతి వద్ద బిల్లులు ఆమోదం కోసం ఎదురుచూస్తున్నామని, ఆమోదం వచ్చే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. బీసీల హక్కులను నిలబెట్టేందుకు నిరంతరంగా పోరాడుతామని హామీ ఇచ్చారు.
పూర్తి రిజర్వేషన్ల అమలు కోసం మోదీ మద్దతివ్వకపోతే, ఆయనను గద్దె దించి రాహుల్ గాంధీని ప్రధాని చేసి బీసీల ఆకాంక్షలు నెరవేర్చుతామని రేవంత్ రెడ్డి వెల్లడించారు.
