
న్యూస్ డెస్క్: తెలంగాణలో ఈ నెల 11 నుంచి మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో వచ్చే ఫలితాలను అధ్యయనం చేసిన తర్వాతే సీఎం రేవంత్ రెడ్డి తదుపరి కార్యాచరణకు రెడీ అవుతున్నారనే చర్చ నడుస్తోంది.
ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డికి సానుకూలంగానే రాష్ట్ర ప్రజలు ఉన్నారన్న వాదనకు ప్రాతిపదిక కనిపించడం లేదు. ఈ క్రమంలో ఇప్పుడు జరగనున్న పంచాయతీ ఎన్నికల తర్వాత.. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఏ రేంజ్లో ఉందో తెలుసుకుంటారు.
ముఖ్యంగా పలు ప్రాజెక్టులను ప్రారంభించాల్సి ఉంది. దీనిలో భాగంగా ఫ్యూచర్ సిటీనుంచి అమరావతి వరకు నిర్మించనున్న ప్రధాన రహదారి పనులకు భూ సేకరణ చేయాల్సి ఉంది. ఇప్పటికిప్పుడు ఈ పని చేయడం ద్వారా ఇబ్బందులు వస్తాయని గ్రహించిన సర్కారు దాన్ని వాయిదా వేస్తోంది.
అలాగే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి జంపింగ్ చేసిన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచన కూడా చేస్తున్నారు. అయితే.. ఈ విషయంలోనూ ప్రజానాడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
వాస్తవానికి పంచాయతీ ఎన్నికల్లో జెండా అజెండా ఉండవు. అయినా.. పార్టీల మద్దతుదారులు రంగంలోకి దిగుతున్నారు. కాంగ్రెస్ హవా గ్రామ పంచాయతీల స్థాయిలో భారీగా కనిపిస్తే.. అప్పుడు ఉప ఎన్నికలపై నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది.
ఈ దిశగానే సీఎం రేవంత్ రెడ్డి వేచి చూస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే.. పంచాయతీ ఎన్నికల ఫలితాలను ప్రాతిపదికగా తీసుకుని తర్వాత కీలక నిర్ణయాలు ఉంటాయన్న చర్చ ఉంది.
