ఏపీ: సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన పీ-4 కార్యక్రమం పేదల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతోంది. వచ్చే ఐదేళ్లలో 20 లక్షల పేద కుటుంబాలను పేదరికం నుంచి బయటకు తీసుకురావడమే లక్ష్యంగా పథకాన్ని తీసుకొచ్చారు.
ఈ లక్ష్య సాధనలో ఆయన తొలి మైలురాయిని దాటి, ఒక్క ఏడాదిలోనే 5 లక్షల కుటుంబాలను మార్గదర్శకులకు అప్పగించే ఏర్పాట్లు చేశారు.
పీ-4 కార్యక్రమాన్ని ఎనిమిది నెలల క్రితం ప్రారంభించిన చంద్రబాబు, రాష్ట్రవ్యాప్తంగా దీనికి మద్దతు తీసుకొచ్చారు. బంగారు కుటుంబాలుగా గుర్తించిన 5 లక్షల మందిని, మార్గదర్శకుల పర్యవేక్షణలో ఆగస్టు 15న చేర్చనున్నారు.
ఈ మార్గదర్శకులు ఆయా కుటుంబాల విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలను గమనిస్తూ, వారికి అవసరమైన సాయాన్ని అందిస్తారు. మూడు సంవత్సరాల్లో ఈ కుటుంబాల స్థితిగతులు మెరుగుపడటం ప్రధాన ఉద్దేశం.
ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి, సచివాలయ వ్యవస్థను పూర్తిగా వినియోగిస్తున్నారు. మార్గదర్శకులను కలెక్టర్ల ద్వారా ఎంపిక చేస్తున్నారు. మొదటి దశ పూర్తి అయిన తరువాత మరో 5 లక్షల కుటుంబాలను ఈ విధంగా ముందుకు తీసుకురావాలని సీఎం నిర్ణయించారు.
2029 ఎన్నికలకు ముందు 20 లక్షల బంగారు కుటుంబాల కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తోంది.