
న్యూస్ డెస్క్: జమ్మూ కశ్మీర్ లో ఇటీవల జరిగిన ఉగ్రదాడికి భారత సైన్యం ప్రతిస్పందనగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ఇప్పుడు విద్యార్థులకు పాఠ్యాంశంగా మారనుంది. దేశ సరిహద్దులపై ఉన్న సవాళ్లు, పాకిస్థాన్ లోని ఉగ్ర స్థావరాలపై జరిగిన ఈ ఆపరేషన్ 23 నిమిషాల పాటు సాగి, తొమ్మిది ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. దేశ భద్రతలో సైనికుల పాత్రను చిన్నప్పటి నుంచే విద్యార్థులకు వివరించాలన్న ఉద్దేశంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్ సీఈఆర్టీ) తాజాగా స్పందిస్తూ, ఆపరేషన్ సిందూర్ అంశాన్ని సిలబస్లోకి తీసుకురావాలని నిర్ణయించినట్టు తెలిపింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గతంలోనే విద్యార్థుల్లో దేశభక్తిని పెంచేలా ఈ మార్పులు అవసరమని అభిప్రాయపడ్డారు.
ఇందుకు ప్రత్యేక మాడ్యూల్ రూపొందించనున్నారు. 3 నుంచి 8 తరగతుల విద్యార్థుల కోసం ఒక భాగం, 9 నుంచి 12 తరగతుల కోసం మరో భాగం ఉంటుందట. విద్యార్థులకు జాతీయ భద్రత, సైనిక వ్యూహం, దౌత్యం లాంటి అంశాలపై అవగాహన పెంచడమే ప్రధాన లక్ష్యం.
ఈ మార్పుల నేపథ్యంలో ఆదిత్య ఎల్1, చంద్రయాన్, అంతరిక్ష ప్రయోగాల వంటి తాజా విజయాలు కూడా కొత్త సిలబస్లో ఉండబోతున్నాయి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లోకి వెళ్లిన భారత యువత వివరాలు కూడా ఇందులో భాగం అవుతాయని అధికారులు తెలిపారు.
ఇలా పిల్లలకు సైన్యం, అంతరిక్ష విజ్ఞానం, దేశ భద్రతపై అవగాహన పెంపొందించేందుకు నూతన సిలబస్ రూపొందిస్తున్నారు. త్వరలోనే ఈ సిలబస్ అమల్లోకి రానుంది.
