
ఆంధ్రప్రదేశ్: ప్రభుత్వం పౌర సరఫరా సేవలను మరింత ప్రజల దాకా తీసుకెళ్లే దిశగా కీలక చర్యలు చేపట్టింది. నూతన రైస్ కార్డుల జారీతో పాటు ఆరు అనుబంధ సేవలను మే 8 నుంచి గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఇక మే 15వ తేదీ నుంచి వాట్సాప్ ద్వారా కూడా ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
వాట్సాప్ నంబర్ 95523 00009కు “Hello” అని పంపితే ఇంటి వద్ద నుంచే సేవలు పొందవచ్చు. చిరునామా మార్పు, కుటుంబ సభ్యుల చేర్పు, తొలగింపు, కార్డు విభజన, సరిదిద్దల వంటి సేవలు సులభతరం కానున్నాయి.
జూన్ మాసంలో అర్హులందరికీ ఉచితంగా స్మార్ట్ కార్డులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈకెవైసీ ప్రక్రియ పూర్తయ్యే దశకు చేరుకున్న నేపథ్యంలో రైస్ కార్డుల జారీ త్వరితంగా సాగనుంది.
ప్రస్తుతం రాష్ట్రంలో 1.46 కోట్ల కార్డులు ఉన్నాయి. సుమారు 4.24 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు. వృద్ధులు, ఒంటరి మహిళలు, లింగ మార్పిడి వ్యక్తులు, కళాకారులు, ఆదివాసీలకు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించామని మంత్రి తెలిపారు.
పీపీటీవై కార్డుల ద్వారా ప్రతి నెలా 35 కిలోల బియ్యం అందించనున్నట్టు స్పష్టం చేశారు. ప్రజల అవసరాలను గుర్తించి, సాంకేతికతను వినియోగించి ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయాన్ని అభినందిస్తున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.