
న్యూస్ డెస్క్: విశాఖలో జరుగుతున్న సీఐఐ సదస్సులో ఏపీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచారు. పెట్టుబడుల సాధనలో ఆయన చూపుతున్న దూకుడు, చొరవ పారిశ్రామికవేత్తలను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా, లోకేష్ “స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” విధానంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే లోకేష్ పనితీరులో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఏఐ, క్వాంటం, గ్రీన్ ఎనర్జీ వంటి ప్రాధాన్య రంగాలపై దృష్టి సారిస్తూ, లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తున్నారు. పక్క రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణలను వెనక్కి నెట్టి ఏపీని పెట్టుబడులకు గేట్వేగా మారుస్తున్నారు.
ఒడిశాకు వెళ్లాల్సిన ‘ఆర్సెల్లార్ మిట్టల్’ సంస్థను కేవలం ఒక్క జూమ్ మీటింగ్తో ఏపీకి రప్పించడం లోకేష్ స్పీడుకు నిదర్శనం. సీఐఐ సదస్సు తొలిరోజే రూ. 12 లక్షల కోట్ల ఒప్పందాలు కుదరగా, అందులో సింహభాగం లోకేష్ చొరవతో వచ్చినవే కావడం గమనార్హం.
గతంలో ఎంవోయూలు కాగితాలకే పరిమితమయ్యేవనే అపవాదును ఈ సదస్సు చెరిపేసింది. ఒప్పందం కుదిరిన క్షణాల్లోనే, అదే వేదికపై పారిశ్రామికవేత్తల చేతికి అనుమతి పత్రాలు అందజేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
రెన్యూ పవర్ సీఈవో సుమంత్ సిన్హా మాట్లాడుతూ, “గత ప్రభుత్వ హయాంలో స్పందన కరువైంది. కానీ ఇప్పుడు లోకేష్ చొరవ చూసి, మా పెట్టుబడిని రూ. 22 వేల కోట్ల నుంచి రూ. 82 వేల కోట్లకు పెంచాం” అని వేదికపైనే కొనియాడారు. జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ జి. మల్లికార్జునరావుతో పాటు పలువురు జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు ఏపీ ప్రభుత్వ వేగాన్ని అభినందించారు.
