
న్యూఢిల్లీ: బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ను రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ కలిసిన సమావేశం కీలకంగా నిలిచింది. తాజ్ ప్యాలెస్లో జరిగిన ఈ భేటీలో రాష్ట్ర విద్య, ఐటీ రంగాల అభివృద్ధిపై సమాలోచనలు జరిగాయి.
టోనీ బ్లెయిర్ ఆధ్వర్యంలోని టోనీ బ్లెయిర్ ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ (TBI) ద్వారా ఏపీ విద్యావ్యవస్థలో ఆధునిక టెక్నాలజీ వినియోగంపై చర్చించారు.
2024 డిసెంబర్లో ఏపీ ప్రభుత్వం–TBI మధ్య ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఈ ఒప్పందం ప్రకారం, విజయవాడలో ఎంబెడెడ్ టీం ఏర్పాటుచేసి, ఉన్నత విద్యా రంగంలో సంస్కరణలపై దృష్టిసారించనున్నారు. అలాగే గ్లోబల్ ఇనిస్టిట్యూట్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఏర్పాటుపై కూడా ప్రత్యేక దృష్టి ఉంది.
విద్యా రంగం, నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ అవకాశాలు వంటి అంశాల్లో టోనీ బ్లెయిర్ సంస్థ సాంకేతిక సహకారం అందించనుంది. భారతేతర దేశాల్లో ఉపాధి అవకాశాలకూ ఈ కార్యక్రమాలు దోహదపడతాయని అధికారులు తెలిపారు.
గ్లోబల్ ఇనిస్టిట్యూట్ సలహా బోర్డులో టోనీ బ్లెయిర్ సభ్యత్వం తీసుకోవాలని లోకేశ్ ఆహ్వానం ఇచ్చారు. విశాఖలో ఆగస్టులో జరగబోయే విద్యామంత్రుల కాంక్లేవ్లో టీబీఐ కూడా పాల్గొననుంది.