
న్యూస్ డెస్క్: ప్రముఖ నటుడు, ఎంఎన్ఎం పార్టీ అధినేత కమల్ హాసన్ తాజాగా రాజ్యసభ ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు. శుక్రవారం ఉదయం పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఆయన తమిళంలో ప్రమాణం చేయడం విశేషం.
కమల్ హాసన్ ఈ ఏడాది జూన్లో డీఎంకే కూటమి మద్దతుతో ఏకగ్రీవంగా ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయనతో పాటు డీఎంకే నుంచి విల్సన్, సల్మా, ఎస్.ఆర్. శివలింగం కూడా ఎంపీలుగా ప్రమాణం చేశారు.
కమల్ 2018లో ఎంఎన్ఎం పార్టీని స్థాపించిన తర్వాత 2021లో డీఎంకే కూటమికి మద్దతు ప్రకటించారు. అదే సమయంలో కూటమి విజయంతో డీఎంకే అధికారంలోకి వచ్చింది.
తమిళనాడు అసెంబ్లీలో డీఎంకే పార్టీకి 134 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దాంతో నాలుగు రాజ్యసభ స్థానాలపై ఆ పార్టీ హక్కును సొంతం చేసుకుంది.
పొత్తులో భాగంగా 2025లో ఎంఎన్ఎం పార్టీకి రాజ్యసభ సీటును ఇవ్వాలని డీఎంకే అంగీకరించింది. అందులో భాగంగా కమల్ హాసన్ రాజ్యసభకు ఎంపీగా ఎంపికయ్యారు.
ఈ ప్రమాణస్వీకారం కమల్ రాజకీయ జీవితంలో మరో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది.
