
న్యూస్ డెస్క్: జపాన్కు చెందిన యసువో టకామట్సు అనే వ్యక్తికి ఆయన భార్య యుకో పంపిన చివరి సందేశం ఇప్పటికీ ఆయన గుండెల్లో నిలిచిపోయింది. 2011 సునామీలో కొట్టుకుపోయే ముందు ఆమె తన ఫోన్ నుంచి పంపిన ఆ సందేశంలో “మీరు క్షేమంగా ఉన్నారా? నేను ఇంటికి వెళ్లాలనుకుంటున్నాను” అని రాసింది. ఈ మెసేజ్, టైప్ చేసి పంపలేని మరో మెసేజ్లో “సునామీ వినాశకరమైనది” అని ఉంది.
ఆ చివరి మాటల జ్ఞాపకంతోనే టకామట్సు గత 14 ఏళ్లుగా సముద్రంలో నిరంతరం అన్వేషణ కొనసాగిస్తున్నాడు. తన భార్య బతికి ఉండదని తెలిసినప్పటికీ, ఆమె అవశేషాలు దొరికితే సక్రమంగా అంత్యక్రియలు నిర్వహించాలనే ఏకైక కోరికతో ఆయన ఉన్నాడు. ఫుకుషిమాలోని మురికి నీటిలో డైవింగ్ చేస్తూ ఒక దశాబ్దానికి పైగా గడపడం అందరి హృదయాలను ద్రవింపజేస్తోంది.
భార్యాభర్తల మధ్య కలహాల వార్తలు వినిపించే ఈ సమాజంలో, తప్పిపోయిన భార్య కోసం జీవితాంతం వెతికే టకామట్సు ప్రేమ ఎంతో అపురూపమైంది. ఈ అన్వేషణ ఎంత కష్టమంటే, సముద్రం అడుగున ఉండే తీవ్రమైన చలి, అంధకారంతో కూడిన అసాధారణ సవాళ్లను ఆయన ఎదుర్కొన్నాడు. టకామట్సు స్వచ్ఛంద సేవకుడు మసయోషి టకామట్సు సహాయంతో డైవింగ్ నేర్చుకున్నాడు.
ఆ సునామీ విపత్తు జపాన్లో దాదాపు 20,000 మంది ప్రాణాలను బలిగొంది. వేలాది మంది తప్పిపోయారు. సమీపంలోని ఒడ్డున పనిచేసే యుకో కూడా వేగంగా దూసుకొచ్చిన ఎత్తైన అలల ధాటికి కొట్టుకుపోయింది. ఆమె ఎటు కొట్టుకుపోయిందో తెలియదు.
తప్పిపోయిన భార్య శిథిలాలు దొరికితే తన ఆత్మ శాంతిస్తుందని యసువో టకామట్సు నమ్ముతున్నాడు. ఈ దుర్ఘటన తర్వాత సునామీ శిథిలాలను శుభ్రం చేసిన అనుభవం ఉన్న టకామట్సు, తన భార్య అవశేషాలు దొరుకుతాయనే ఆశతో అవిశ్రాంతంగా వెతుకుతున్నాడు. ఆయన దృఢమైన నమ్మకం ఎప్పటికైనా ఫలించాలని ఈ విషయం తెలిసినవారంతా కోరుకుంటున్నారు.
