
న్యూస్ డెస్క్: ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల తన పార్టీని జాతీయ పార్టీగా తీర్చిదిద్దుతానని ప్రకటించారు. వచ్చే 10 ఏళ్లలో ఈ లక్ష్యం సాధ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రకటనతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.
ఇప్పటికే తెలుగు దేశం పార్టీ (టీడీపీ) జాతీయ పార్టీగా రిజిస్టర్ అయినప్పటికీ, ఇతర రాష్ట్రాల్లో పార్టీ యాక్టివిటీ బలహీనంగానే ఉంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని జనసేన నిజంగానే జాతీయ స్థాయిలో విస్తరించగలదా అనే ప్రశ్నలు మొదలయ్యాయి.
జనసేన విస్తరణ వెనుక బీజేపీ వ్యూహం కూడా ఉందని విశ్లేషకులు అంటున్నారు. తమిళనాడు, కర్ణాటక, ఒడిశా వంటి రాష్ట్రాల్లో జనసేన ఆవిర్భావం బీజేపీకి అనుకూలం కావొచ్చని అభిప్రాయం. ముఖ్యంగా తమిళనాడులో దళపతి విజయ్ రాజకీయ రంగప్రవేశం, పవన్ కల్యాణ్ వ్యూహం మధ్య సంబంధం ఉందని ప్రచారం జరుగుతోంది.
అసోం గణ పరిషత్ లాంటి ఉదాహరణలను తీసుకుంటే, బీజేపీ తనకు బలహీనమైన ప్రాంతాల్లో స్థానిక పార్టీలను జాతీయ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోందని అర్థమవుతుంది. ఇదే ధోరణిలో జనసేనకు ప్రోత్సాహం లభిస్తున్నట్లు తెలుస్తోంది.
