
గుంటూరు: జిల్లా తెనాలి పట్టణంలో దళిత, మైనారిటీ యువకులపై పోలీసులు అత్యాచారాత్మకంగా ప్రవర్తించారన్న ఆరోపణలపై వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ తీవ్రంగా స్పందించారు. సంఘటనను తీవ్రంగా ఖండించిన ఆయన, ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం అణచివేతకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
జాన్ విక్టర్, దోమ రాకేష్, షేక్ బాబులాల్లపై జరిగిన దాడి దారుణమని అభివర్ణించారు. “రోడ్డుపై కూర్చోబెట్టి లాఠీలతో కొట్టడం, అధికారుల వైఖరిలో నిర్దాక్షిణ్యత కనిపించడమంటే ఇది రాజ్యాంగపరమైన గౌరవానికి తీవ్ర అవమానం” అని జగన్ అన్నారు. ఈ ఘటన బయటపడకుండా నెలరోజులుగా దాచిపెట్టడమే ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని చెప్పారు.
ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమేనని, రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఎన్నో ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రజల్లో భయం, బెదిరింపులు పెరిగిన నేపథ్యంలో ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన అవసరం ఉందని జగన్ హితవు పలికారు.
ఈ అరాచకానికి చంద్రబాబు సర్కార్ పూర్తిగా బాధ్యత వహించాలన్నారు. పోలీసులు న్యాయ ప్రక్రియను పక్కనపెట్టి దాడులకు దిగడమనే దుస్థితి నెలకొంది అని మండిపడ్డారు.
ప్రజల ప్రాథమిక హక్కులకు రక్షణ లేకపోతే, అలాంటి పాలనను నిలదీయాల్సిన అవసరం ఉందని, ప్రజలు ఈ విధ్వంస పాలనకు చరమగీతం పాడాలని జగన్ పిలుపునిచ్చారు.